విచ్చలవిడిగా ‘పెద్దాపరేషన్లు’
సగటున 30 ఏళ్లలోపే బిడ్డసంచీ తొలగింపు
సమిధలవుతున్న గ్రామీణ పేద మహిళలు
‘ఆరోగ్యశ్రీ’తో అడ్డగోలుగా పెరిగిన సంఖ్య
విపరిణామాలు తెలియక ఒప్పుకొంటున్నారు
సర్జరీ తర్వాత విలవిల్లాడుతున్నారు
వైద్యుల ముసుగులో కాసుల రాబందులు
రాష్ట్రమంతా ఇదే జాడ్యం
అభంశుభం తెలీని అమాయక ఆడపడుచులకు ఇప్పుడు ఆ’గర్భ’శోకం వచ్చింది!
మాతృత్వానికే కాదు.. స్త్రీల ఆరోగ్యానికీ, అస్తిత్వానికీ, ఆయుర్దాయానికి కూడా మూలాధారమైన బిడ్డసంచులు.. ఇప్పుడు పట్టుమని మూడు పదులు కూడా దాటక ముందే.. కాసుల వేటగాళ్ల చురకత్తులకు కసుక్కునతెగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ‘పెద్దాపరేషన్లు’ విచ్చలవిడిగా.. విచక్షణారహితంగా సాగిపోతున్నాయి. వైద్యపరంగా అవసరం లేకపోయినా.. మందులతో చికిత్స చేసే అవకాశం ఉన్నా కూడా ఎంతోమంది స్త్రీలకు ఇప్పుడు గర్భాశయాన్ని తొలగించే ‘హిస్ట్రెక్టమీ’ ఆపరేషన్లు చేసేస్తున్నారు. ఈ అడ్డగోలు ఆపరేషన్లు మన రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతున్నాయంటే.. ఇప్పుడు సగటున 30 ఏళ్లు కూడా నిండకుండానే గర్భాశయాలు తెగిపోతున్నాయని తేలటం మరింత విభ్రమాన్ని కలిగిస్తోంది. ఒకప్పుడు వైద్యులు కనీసం ఆపరేషన్ ఖర్చులు భరించలేరన్న ఆలోచనతోనైనా బలహీన వర్గ స్త్రీలకు మందులతో చికిత్స చేసేవారు. కానీ ఇప్పుడు ‘ఆరోగ్య శ్రీ’ అండ చూసుకుని.. ఎలాగైనా డబ్బులు దండుకోవచ్చన్న దురాశతో.. సామాజికంగా వెనకబడిన ఆ వర్గాల మహిళలే లక్ష్యంగా ఆపరేషన్లు చేస్తున్నారు. వైద్యపరంగా చికిత్సా మార్గాలు ఉండి కూడా.. ‘ఆరోగ్యశ్రీ’ పథకం కింద అడ్డగోలుగా చిన్నవయసు వారికే గర్భాశయాలు తొలగించేస్తున్నారన్న వాస్తవం సాక్షాత్తూ రాష్ట్ర విజిలెన్స్ విభాగం నిర్వహించిన దర్యాప్తులోనే తేలటం ఒళ్లు గగుర్పొడుస్తోంది. చిన్నవయసులోనే గర్భాశయాన్ని తొలగిస్తే ఎటువంటి విపరిణామాలు తలెత్తుతాయో తెలియక, అవగాహనా లేమితో సర్జరీకి ఒప్పుకుంటున్న ఎంతోమంది అమాయక మహిళలు.. ఆ తర్వాత ఎన్నో ఆనారోగ్య సమస్యల బారినపడి నిత్యం నరకం అనుభవిస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితుల్లో పనులు చేసుకోలేక కడగండ్ల పాలవుతున్నారు. సమాజంలో అత్యంత బాధ్యతాయుతంగా మెలగాల్సిన అపర ‘ప్రాణదాత’లు.. వైద్యవృత్తికే తలవంపులు తెస్తూ.. కనీస మానవత్వాన్ని సైతం కాలదన్నుతూ.. ఇలా కాసుల కోసం కక్కుర్తిపడుతూ అమాయక స్త్రీల జీవితాలతో చెలగాటమాడుతున్న తీరుపై సవిరమైన కథనం ఇది!
పొత్తికడుపు నొప్పి .. ఇంకా.. వూర్కూరికే బాధ..
పిల్లలున్నారా? ఆ.. ఉన్నారు
అయితే ఇంకెందుకు, గర్భసంచీ తీయించేసుకో…
అన్ని గొడవలూ తీరిపోతాయ్!
రాష్ట్రంలో పెద్దాపరేషన్లు ఎంత విచ్చలవిడిగా సాగుతున్నాయో చెప్పేందుకు చిన్న సూచిక మాత్రమే ఈ సంభాషణ! గర్భాశయమంటే కేవలం సంతానం కోసమేననీ, పిల్లలు కలిగాక ఇక దానికి ప్రత్యేకంగా ఏ ప్రయోజనమూ ఉండదని అమాయకంగా నమ్ముతున్న ఎంతోమంది మహిళలు దాన్ని ‘వదిలించుకుంటే’ ఇక ఏ బెడదా ఉండదని భ్రమపడుతున్నారు. తరచూ రుతుక్రమం సమస్యలు, పొత్తికడుపు నొప్పి, తెలుపు.. ఈతి బాధలన్నింటికీ ఆపరేషన్తో శాశ్వత పరిష్కారం లభిస్తుందని అపోహపడుతున్నారు. చిన్నవయసులోనే గర్భాశయాన్ని తొలగించటం వల్ల తలెత్తే విపరిణామాలను వారికి వివరించాల్సిన వైద్యులు.. ఆ పని చెయ్యకపోగా, వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి కాసులు దండుకోవాలని ప్రయత్నిస్తుండటం, ఇందుకోసం ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని అడ్డదారులు తొక్కిస్తుండటం.. ప్రస్తుత విషాదానికి మూలం.
గుంటూరు, ఆ వెంటే అన్నీ!
గుంటూరు జిల్లాలో ‘ఆరోగ్యశ్రీ’ కింద జరిగిన 1141 పెద్దాపరేషన్ల (హిస్ట్రెక్టమీ)లో 776 (68%) కేసులు 21-40సం|| లోపు వారే ఉన్నారు. వాస్తవానికి వైద్యప్రమాణాల ప్రకారం 40 సం|| లోపు వారికి ఎంతో అవసరమైతే తప్పించి గర్భసంచి తొలగించరాదు. గుంటూరు జిల్లాలో ఈ ఆపరేషన్లు చాలా ఎక్కువగా చేసేస్తున్నారని ఎప్పటి నుంచో సర్వేలు ఘోషిస్తున్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంస్థ (ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ) నిర్వహించిన సర్వేల్లో సైతం ఇదే విషయం వెల్లడైంది. తాజాగా ఈ ఆపరేషన్ను ‘ఆరోగ్యశ్రీ’ పథకంలో చేర్చిన తర్వాత… వీటి సంఖ్య మరింత పెరిగింది. ముఖ్యంగా ఈ జిల్లాలోని అంజిరెడ్డి ఆస్పత్రి(పిడుగురాళ్ల), బి.ఎం.ఆర్.ఆస్పత్రి(గుంటూరు), నందన ఆస్పత్రి(గుంటూరు)ల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందని రాష్ట్ర విజిలెన్స్ విభాగం విస్పష్టంగా నిగ్గుతేల్చి, నివేదిక సైతం ప్రభుత్వానికి సమర్పించింది. గుంటూరు జిల్లాలో జరిగిన మొత్తం పెద్దాపరేషన్లలో 51% ఈ మూడింటిలోనే జరిగాయని విచారణలో వెలుగుచూసింది. నిజానికి గర్భసంచి గురించి కనీస అవగాహన కూడా లేని బడుగు వర్గాల మహిళలను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న ఈ వ్యాపారం ఒక్క గుంటూరుకు మాత్రమే పరిమితం కాదు. మెదక్ జిల్లాలోని లంబాడీ తండాల్లో అత్యంత విచక్షణారహితంగా ఈ ఆపరేషన్లు సాగిపోతున్నాయని, 23-25 ఏళ్ల వారికి సైతం గర్భాశయాలు తొలగించేస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకంలో గర్భసంచి తొలగింపుకు రూ.25 వేల వరకు ఇస్తుండడంతో కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఇదే తంతు నడుస్తున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాలో ఆరోగ్యశ్రీ కింద జరుగుతున్న పెద్దాపరేషన్ల తతంగంపై విజిలెన్స్ అధికారులు విచారించి బాధ్యులైన వైద్యులు, ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి నివేదిక సమర్పించారు. వీటిలో ఒక్క అంజిరెడ్డి ఆసుపత్రిని మాత్రం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ నుంచి తొలగించారు. మిగతా రెంటి పైనా ఇప్పటికీ ఎటువంటి చర్యల్లేవు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కింద ఇప్పటి వరకు మొత్తం 11638 పెద్దాపరేషన్లు జరిగాయి. అక్రమాల నేపథ్యంలో అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేకంగా విచారణ జరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
తీసేస్తే ఏం?
మాతృత్వానికే కాదు, స్త్రీ సాధారణ ఆరోగ్యానికి సైతం గర్భాశయం కీలకం. రుతుచక్రం ఆరంభమైనప్పటి నుంచీ నిరంతరం స్త్రీహార్మోన్లను విడుదల చేస్తూ.. నెలసరి నిలిచిపోయే వరకూ కూడా స్త్రీ జీవితంలో గర్భాశయం, అండాశయాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే అనారోగ్య కారణంగా ఎంతో అవవసరమైతే తప్పించి 40సం|| లోపు వారికి గర్భసంచి తొలగించే ఆపరేషన్లు చెయ్యకూడదన్నది వైద్యసూత్రం. కానీ కాసుల కోసం కొన్ని ఆస్పత్రుల్లో వైద్యులు నిసిగ్గుగా చిన్న వయసు వారికే గర్భాశయాలు తీసిపారేస్తున్నారు. కేవలం మందులతో, ఇతరత్రా మార్గాల ద్వారా చికిత్స అందించే వీలున్నా కూడా.. వీరు ఆ మార్గాలేవీ ప్రయత్నించకుండా నేరుగా సర్జరీలు చేశారని ‘రీజినల్ మెడికల్ బోర్డ్’ నిపుణులు నిర్ధారించారు. పెద్దాపరేషన్ చేయించుకోకపోతే గర్భసంచిలో గడ్డ పెద్దదై క్యాన్సర్లాంటి ప్రాణాంతక వ్యాధి వస్తుందనే అపోహలతో చదువురాని అమాయక మహిళలు దీనికి బలైపోతున్నారు. గుంటూరు జిల్లాలో ఆరోగ్యశ్రీ కింద 20 ఆస్పత్రుల్లో 1141 పెద్దాపరేషన్లు చెయ్యగా… వీరిలో 68% అంటే 776 మంది 21 నుంచి 40 సం|| లోపువారేనని తేలింది. రాష్ట్రంలో జరుగుతున్న పెద్దాపరేషన్ల సగటు వయసు 24 సంవత్సరాలని ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ సర్వేలో వెల్లడైంది. ఇది ఆందోళనకర పరిణామం. గర్భసంచి కత్తిరించిన తరవాత ఏళ్లు గడిచే కొద్దీ మహిళలు రకరకాల ఆరోగ్య సమస్యల బారినపడే అవకాశాలుంటాయి. కానీ సర్జరీ ముందు ఈ విషయాలేవీ వైద్యులు వారికి సర్జరీ ముందర వివరించటం లేదు. ఆపరేషన్ చేయించుకున్న 97% మహిళలకు పెద్దాపరేషన్ తరవాత వచ్చే సమస్యలపై వైద్యులు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సర్వేలో వెల్లడైంది. ఇది అత్యంత హేయమైన చర్య. ఎలాంటి శస్త్రచికిత్స చేయాల్సినా… దానివల్ల ఎదురయ్యే విపరిణామాలను రోగులకు విపులంగా చెప్పాలి. మహిళల ఆయుర్దాయానికి, సురక్షిత ఆరోగ్యానికి కీలకమైన గర్భాశయాన్ని తొలగించే సమయంలో వైద్యులు దీన్ని ఉద్దేశపూర్వకంగానే చెప్పడంలేదనే ఆరోపణలున్నాయి.

ఎలా సాగుతోంది?
ప్రజల అమాయకత్వాన్ని, చదువురాకపోవడాన్ని ఆసరాగా చేసుకుని వైద్యంతో నయమయ్యే ఆరోగ్య సమస్యలను భూతద్దంలో చూపించి పెద్దాపరేషన్లు చేయించుకోవడానికి మహిళలను పురిగొల్పుతున్నట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు మందులతో సాధారణ చికిత్స చేస్తే ఆరోగ్యశ్రీలో ఆస్పత్రులకు ఎలాంటి మొత్తం రాదు. లాప్రోస్కోపిక్ విధానంలో గర్భసంచి తొలగిస్తే రూ.25 వేల వరకు పొందడానికి అవకాశం ఉంది. ఇదే అభంశుభం తెలియని పేద మహిళల పాలిట శాపంగా మారుతోంది.
వాస్తవానికి రాష్ట్రంలో స్త్రీల జననాంగ, రుతుక్రమ సమస్యలకు చికిత్స అందించే వైద్య సదుపాయాలేవీ బలహీన వర్గాల వారికి అందుబాటులో ఉండటం లేదని, దీంతో చిన్నాచితకా సమస్యలతో విసిగిపోయిన వారంతా గర్భాశయ తొలగింపు ఆపరేషన్ను పెద్ద పరిష్కారంగా భావిస్తున్నారని ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ అధ్యయనంలో గుర్తించారు. నెలనెలా రుతుక్రమం బెడద ఉండదనీ, గర్భనిరోధం బాధలూ ఉండవని భ్రమపడుతూ ఈ పెద్ద సర్జరీకి వెళుతున్నారు. కానీ సర్జరీ తర్వాత తలెత్తే బాధలేమిటో అవగాహన లేక, వాటికి వైద్యం చేయించుకోలేక జీవితాంతం నరకం అనుభవిస్తున్నట్టు వారి మాటలే చెబుతున్నాయి.
నివేదిక బయటపెట్టిన నిస్సిగ్గు వాస్తవాలు
అంజిరెడ్డి ఆస్పత్రి, పిడుగురాళ్ల: ఈ ఆస్పత్రిలో 2008 జులై-2009 జులైల మధ్య 306 మంది పెద్దాపరేషన్లు చేయగా అందులో 223 మంది 40సం||లోపు వారే. వీరిలో 113 మంది వయసు 35సం||. ఇక్కడ జరిగిన 200 ఆపరేషన్లు గర్భాశయం, అండనాళాల్లో ఇన్ఫెక్షన్ వల్ల తొలగించినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. విజిలెన్స్ విచారణలో భాగంగా మెడికల్ బోర్డు కేసుషీట్లు పరీక్షించగా వీరందరికీ అపరేషన్ లేకుండానే మందులతో చికిత్స చేయచ్చని తెలిపారు. ఇందులో 30 సం||లోపు వారు 30 మందికి గర్భాశయ ఇన్ఫెక్షన్ల పేరుతో పెద్దాపరేషన్లు చేశారని గుర్తించారు. గడ్డలు ఉన్నాయని గర్భాసంచులు తొలగించిన తొమ్మిది కేసుల్లో ఐదుగురికి అవసరం లేకున్నా ఆపరేషన్ చేశారని తేల్చారు. మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదిక ఆధారంగా విజిలెన్స్ అధికారులు 25 కేసులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో 21 మందకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకున్నా గర్భసంచి తొలగించినట్లు గుర్తించారు.
బి.ఎం.ఆర్.ఆస్పత్రి, గుంటూరు: మొత్తం 140 పెద్దాపరేషన్లు చేయగా అందులో 85 కేసులు 40సం||లోపు వారే ఉన్నారు. ఇందులో 35సం||లోపు 24 కేసులున్నాయి. ఆపరేషన్లు చేయించుకున్న 40సం||లోపు ఉన్న 30 మందికి సంబంధించిన కేసుషీట్లు తనిఖీ చేయగా… గర్భశయంలో గడ్డలు ఉన్నాయనే కారణాన్ని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. మెడికల్బోర్డు చేసిన విచారణలో వీటన్నింటికీ ఆపరేషన్ అవసరం లేకుండా వైద్యచికిత్సతో నయం చేయవచ్చునని తేల్చింది. ఆ తరవాత విజిలెన్స్ అధికారులు 13 కేసులను క్షుణ్ణంగా విచారణ చేపట్టగా అయిదు మందికి ఆపరేషన్ చేయాల్సిన అవసరమేలేదని నిర్ధారణ అయింది.
నందన ఆస్పత్రి, గుంటూరు: 138 పెద్దాపరేషన్లు చేయగా, 90 కేసులు 40సం||లోపు ఉన్నవారే. ఇందులో 35సం||లోపు ఉన్నవారు 11 మంది ఉన్నారు. అధిక రక్తస్రావం, గర్భాశయంలో గడ్డలు, ఇన్ఫెక్షన్లను కారణంగా పేర్కొంటూ 82 మందికి గర్భశయాలను తొలగించినట్లు మెడికల్ బోర్డు గుర్తించింది. ఇవన్నీ శస్త్రచికిత్స అవసరం లేకుండానే సాధారణ వైద్యంతో నయం చేయవచ్చునని తేల్చింది. విజిలెన్స్ అధికారులు 9 కేసులను క్షుణ్ణంగా అధ్యయనం చేయగా అందులో ఏడు మందికి ఆపరేషన్లు అవసరం లేదని నిర్ధారించారు. పెద్దాపరేషన్లు చేయడం కోసం రోగుల వయసులను ఆస్పత్రి వర్గాలు పెంచి చూపినట్లు గుర్తించారు.
విజిలెన్స్శాఖ సిఫారసులు: నిధులను దుర్వినియోగం చేయడంతో పాటు శస్త్రచికిత్సలు అవసరంలేని వారికి గర్భసంచులు తొలగించిన ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ పథకం నుంచి తొలగించాలి. సరైన రోగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా గర్భాశయాలను తొలగించినందుకు డాక్టర్ ఎల్.సుస్మారెడ్డి, డాక్టర్ అంజిరెడ్డి(అంజిరెడ్డి ఆస్పత్రి-పిడుగురాళ్ల), డాక్టర్ దీప్తిరెడ్డి, డాక్టర్ ప్రభావతి(బి.ఎం.ఆర్.ఆస్పత్రి-గుంటూరు), డాక్టర్ ఎ.లక్ష్మమయ్య, డాక్టర్ ప్రియా నందన(నందన ఆస్పత్రి-గుంటూరు)లు దీనికి బాధ్యులని తేల్చింది. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. గుంటూరు జిల్లాలోని మిగిలిన ఆస్పత్రుల్లో జరిగిన అక్రమాలను గుర్తించడానికి ప్రత్యేక కమిటీని వేయాలి. గర్భాశయ శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ఇస్తున్న అనుమతుల విషయంలో ఉన్న లోపాలను సరిచేయాలి.
చర్యలు తీసుకుంటాం: బాబు, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీ.ఇ.ఓ.
నిపుణుల సూచన మేరకు అవసరమైతేనే పెద్దాపరేషన్ చేయాలనేది నిబంధన. పేదవారికి మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీలో దీన్ని చేర్చడం జరిగింది. దీన్ని దుర్వినియోగం చేసినట్లు గుంటూరు జిల్లాలో వచ్చిన ఆరోపణలపై ప్రత్యేక కమిటీతో విచారణ చేయిస్తున్నాం. ప్రతి కేసును వారిని పరిశీలిస్తున్నారు. ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఇప్పటికే అంజిరెడ్డి ఆస్పత్రిని ఆరోగ్యశ్రీ పథకం నుంచి తొలగించాం. మిగిలిన రెండు ఆస్పత్రులపై విచారణ జరుగుతోంది. నివేదిక వచ్చిన వెంటనే కఠినచర్యలు తీసుకుంటాం.
పడరాని పాట్లు పడుతున్నాం!
పిడుగురాళ్ల, న్యూస్టుడే
ఈమహిళలంతా 30 ఏళ్ల లోపువారే.. తరచూ కడుపునొప్పితో బాధపడుతూ దగ్గర్లో ఉన్న డాక్టర్ అంజిరెడ్డి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లారు. పరీక్షలు చేశాక కడుపులో గడ్డలున్నాయని కొందరికి.. పెద్దాపరేషన్ చేస్తే త్వరగా తగ్గుతుందని ఇంకొందరికి వైద్యులు సూచించారు. వెంటనే పనులు చేసుకోవచ్చనీ చెప్పారు. తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు పైసా ఖర్చులేదు.. అంతా ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తామనడంతో ఆ పేద మహిళలు తలూపారు. తీరా శస్త్రచికిత్స పూర్తయ్యాక తాము ఏ పనీ చేయలేని స్థితికి చేరుకున్నామని ఆదివారం పలువురు మహిళలు ‘న్యూస్టుడే’తో చెప్పారు. గర్భసంచి తొలగించిన తర్వాత వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి వైద్యులు వారికి వివరించకపోవడం గమనార్హం.
ఎందుకో చెప్పలేదు
బాడిసె భూలక్ష్మి.. వయసు 25 సంవత్సరాలు, పిడుగురాళ్ల ఏడోవార్డు, శ్రీనివాసకాలనీలో నివాసం ఉంటున్నారు. కుమార్తె త్రివేణి 2 వ తరగతి, కుమారుడు మణికంఠ ఒకటో తరగతి చదువుతున్నారు. భర్త కోటేశ్వరావుతో కలిసి రోజు ఇటుకరాయి పనికి వెళ్తే రూ.150 కూలి వస్తుంది. 2008 మే నెల నుంచి తరచూ కడుపునొప్పి వస్తుండటంతో చూపించుకుందామని ఆగస్టు నెలలో అంజిరెడ్డి ఆసుపత్రికి వెళ్ళింది. పరీక్షలు చేసిన వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు. గర్భసంచి తీసేయాలన్నారు. ఆగస్టు 15న శస్త్రచికిత్స చేశారు. ఎందుకనే విషయం మాత్రం చెప్పలేదని ఆమె వివరించింది. తర్వాత ఆరు నెలలు బాగానే ఉన్నా.. అక్కడ నుంచి ఏ పని చేయలేకపోతున్నా.. అంతకుముందే బాగుంది.. అని తెలిపింది. వేరే డాక్టర్కు చూపిస్తే ఒంట్లో నీరు చేరిందంటున్నారు.. నెలకు రూ.900 మందులకే అవుతున్నాయి.. అని ఆమె వాపోయింది. ఈ వయసులో గర్భసంచి తొలగించే ఆపరేషన్ చేయటం ఏంటి.. అవసరం లేకపోయినా చేశారు.. ఇప్పుడు మేం చేయలేం అని వేరే డాక్టర్లు అంటున్నారు ఏం చేయాలో అర్ధం కావట్లేదు.. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి అని భూలక్ష్మి వేడుకుంటోంది. ‘కూర్చుని లేవలేకపోతోంది. అన్నీ రోగాలే.. ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నాం’ అని భర్త కోటేశ్వరావు వివరించారు.
పెద్దాపరేషన్ చేయించుకుంటావా అన్నారు
కూలిపనికి వెళ్లే ఎస్.కె.జరీనా వయసు 28 సంవత్సరాలు. భర్త జాకీరు టైర్ల రీబటన్ దుకాణంలో పనిచేస్తాడు. నెలకు రూ.3 వేలు వస్తాయి. ఇద్దరుపిల్లలు. ‘కడుపు నొప్పి వస్తుంటే ఆసుపత్రికి వెళ్ళా.. పరీక్షలు చేశాక కడుపులో గడ్డ ఉంది.. పెద్దాపరేషన్ చేయించుకుంటావా అని అడిగారు. వేరే ఆసుపత్రిలో అయితే రూ.10వేల దాకా అవుతోందని చెప్పడటంతో ఒప్పుకున్నా. ఇప్పుడు ఏ పనీ సరిగా చేయలేకపోతున్నా’ అని ఆమె వివరించింది.
పరీక్షలు చేసి గర్భసంచి తీసేయాలన్నారు
14వ వార్డులో ఉండే బత్తుల కోటేశ్వరమ్మ వయస్సు 25 సంవత్సరాలు.. భర్త చినవెంకటయ్య. వారికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. పొలం పని చేసుకుని జీవిస్తుంటారు. ‘అప్పుడప్పుడూ కడుపునొప్పి అంటుంటే ఏడాదిన్నర కిందట అంజిరెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్ళా.. ఏమైనా అవసరం అవుతాయేమో అని రూ.20 వేలు సిద్ధం చేసుకున్నా.. అక్కడికెళ్ళాక టి.వి(స్కానింగ్), ఎక్స్రేలు తీస్తే వెయ్యి రూపాయలు అయ్యాయి’ అని భార్య శస్త్రచికిత్స గురించి భర్త చినవెంకటయ్య వివరించారు. పరీక్షలు పూర్తయ్యాక గర్భసంచి తీసెయ్యాలన్నారు. కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేస్తామని చెప్పడంతో ఒప్పుకున్నామని కోటేశ్వరమ్మ చెప్పింది. రక్తం అవసరమైతే మా తమ్ముడే ఇచ్చాడు. ఆపరేషన్ చేశాక ఇంటికి పంపుతూ వారానికి మాత్రం బిళ్లలు ఇచ్చారు. మళ్ళీ వారం రోజుల తర్వాత జ్వరం వస్తే వెళ్లాం.. రక్తం మారిందేమో అని డబ్బులు తీసుకుని పరీక్ష చేశారు అని ఆమె పేర్కొంది. ఆపరేషన్ చేశాక క్రమంగా నొప్పులు మొదలయ్యాయి.. ఇప్పుడు అంతా నొప్పులు. కూర్చోలేను, నిలబడలేను. చిన్న బరువు పట్టినా, పనిచేసినా భరించలేని నొప్పి వస్తోందని తన బాధను వెల్లడించింది. ఆమెకు బాగున్నపుడు పదెకరాల పొలం కౌలుకు తీసుకుని పంట పండించా.. ఇపుడు సరిగా పని చేయలేదు.. అందుకే మూడెకరాలు మాగాణి మాత్రమే చేసుకుంటున్నా అంటున్న చినవెంకటయ్య మాటలు మారిన ఆ కుటుంబ స్థితిని చెప్పకనే చెపుతున్నాయి.
చిన్నవయసులో ఆపరేషన్ అనర్థదాయకం:
డా|| బాలాంబ, డా|| జయంతిరెడ్డి
మహిళల్లో వయసురీత్యా వచ్చే మార్పులకు అనుగుణంగా హార్మోన్లను సమతుల్యం చేయడం, ఎముకల పటుత్వం కాపాడుతూ మహిళలకు ఆరోగ్యప్రదమైన జీవితం గడపడానికి గర్భసంచి, అండాశయాలు ఎంతో అవసరం. చాలామంది గర్భసంచి తొలగించుకుంటే నెలనెలా బహిష్టు బాధలు తగ్గిపోతాయని భావిస్తున్నారు. కొంతమంది వైద్యులు దీన్ని సంపాదనమార్గంగా ఎంచుకుని… కడుపునొప్పి, అధిక రక్తస్రావం, తెల్లబట్టలాంటి సమస్యలతో ఆస్పత్రులకు వచ్చేవారికి పెద్దాపరేషన్లు చేయించుకోమని ప్రోత్సహిస్తున్నారు. కడుపు నొప్పి ఉంటే క్యాన్సర్ అని భయపెడుతున్నారు. గర్భసంచి తొలగించుకుంటే ఎలాంటి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చునని చెబుతున్నారు. ఇది సరికాదు.
గర్భసంచిలో గడ్డలకు మయొమెక్టమీ, కాటరీ, ఐస్ ట్రీట్మెంట్లాంటి అధునాతన పద్ధతులున్నాయి. తెల్లబట్ట, కడుపునొప్పికి చక్కటి మందులు ఉన్నాయి. అవసరమైతే చిన్నపాటి శస్త్రచికిత్సలతో వీటిని నయం చేసుకోవచ్చు. స్త్రీ సంబంధిత ఆరోగ్య సమస్యలకు అనేక రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చినా… వాటిపై మహిళలకు అవగాహన లేకపోవడంతో ఇలాంటివి జరుగుతున్నాయి. అవసరం లేకున్నా పెద్దాపరేషన్లు చేయించుకుంటే భవిష్యత్తులో చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.
చిన్నవయసులో గర్భాశయం తొలగిస్తే!
* మహిళల్లో హార్మోన్ల సమతౌల్యం దెబ్బతింటుంది.
* ఒళ్లంతా వేడిఆవిర్లు వస్తున్న భావన. నిద్ర సరిగా పట్టదు.
* ప్రతి చిన్న విషయానికి విసుగు, చికాకు, విపరీతమైన తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
* ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గుదల వల్ల ఎముకలకు తగు మోతాదులో కాల్షియం అందక ఎముకల పటుత్వం తగ్గిపోతుంది.
* ఎముకలు బోలుగా అయిపోయి త్వరగా ఆస్టియోపొరోసిస్ బారిన పడే అవకాశాలు పెరుగుతాయి.
* మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి.
* కాబట్టి గర్భసంచి తొలగించాలని ఎవరైనా సిఫార్సు చేస్తే… వెంటనే ఆపరేషన్కు వెళ్లకుండా.. తప్పనిసరిగా మరో స్త్రీసంబంధ వ్యాధి నిపుణుల అభిప్రాయం తెలుసుకోవాలి.

source : eenadu 25 January 2010
January 25, 2010
Categories: Uncategorized . Tags: aarogyashree, Anji Reddy Hospital, BMR Hospital, Dr.Balamba, Dr.Jayanthi Reddy, health, hysterectomy, IIHFW, Nandana Hospital, removal of uterus, state vigilance dept., unnecessary surgeries . Author: carped . Comments: Leave a Comment