బకాసురులెవరు?
కుటుంబాలు 44 లక్షలు, కేవలం తెల్లకార్డులే 184 లక్షలు
మరి తక్కిన 140 లక్షల కార్డుల బియ్యం ఎవరు తింటున్నట్లు?
రాష్ట్రంలో పేద ప్రజలు ఎంతమంది ఉన్నారు? నిరుపేద కుటుంబాల సంఖ్య ఎంత? ఈ ప్రశ్నలకు ఎవరు చెప్పిన ఒకే సమాధానం రావాలి. ఎందుకంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదప్రజల సంఖ్యపై సర్వే చేస్తాయి. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సంఖ్యను నిర్ధారిస్తాయి. రాష్ట్రంలోని పేదరికానికి సంబంధించి ఈ సర్వే సమాచారాన్ని ప్రామాణికంగా పరిగణిస్తారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో పేదలు ఎంతమంది ఉన్నారన్న ప్రశ్నకు రక రకాల సమాధానం వస్తున్నది. ప్రభుత్వాల రికార్డుల ప్రకారమే మొత్తం జనాభాలో 20శాతం మంది అని, కాదు 80 శాతం మంది అని మరో పద్ధతిలో పేద ప్రజల లెక్కలను తేలుస్తున్నారు. కేంద్రం 2002లో సాంకేతి కంగా నిర్వహించిన సర్వే ప్రకారం రాష్ట్రంలో సుమారుగా 44 లక్షల కుటుంబాలున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన తెల్లరంగు రేషన్కార్డుల ప్రకారం 1.84 కోట్ల పేద కుటుంబాలు ఉన్నట్టు స్పష్టం అవుతున్నది. ఈ రెండు సంఖ్యల్లో దేనిని ప్రమాణికంగా తీసుకోవాలంటే, అవసరాన్నిబట్టీ ఆయా సందర్బాల్లో దేనినైనా ఉపయోగించుకోవచ్చన్న ధోరణిలో ప్రభుత్వం ఉంది.ప్రస్తుతం ప్రారంభించిన రెండు రూపాయలకు కిలో బియ్యం పధకం రాష్ట్రంలోని దారిద్య్రరేఖకు (బిపిఎల్) దిగువన ఉన్న కుటుంబాలకు వర్తింపజేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం కోటి 84 లక్షల తెల్లరేషన్ కార్డులున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో సుమారు 7 కోట్ల మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టు అంచనా వేయాల్సి వస్తుంది. 2004వ సంవత్సరం 1.30 లక్షలు ఉన్న ఈ తెల్లరంగు రేషన్ కార్డుల సంఖ్య ఈ నాలుగేళ్లలో మరో 50 లక్షలకుపైగా పెరిగాయి. ఈ లెక్కన రాష్ట్రంలో 80 నంచి 85 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది వాస్తవమేనా?, 2002వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహంచిన సర్వేలో ఈ విషయం ఎందుకు తెలియలేదు?, అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో బిపిఎల్ కుటుంబాల సంఖ్య 44 లక్షలు మాత్రమే. మొత్తం జనాభాలో వీరిది 22 శాతం మాత్రమే. గత ఆరు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, వివిధ రంగాల్లో చోటు చేసుకున్న పలు మార్పుల కారణంగా ముందుకొస్తున్న అనేక అవకాశాల వల్ల బిపిఎల్ కుటుంబాల సంఖ్య ఇంకా తగ్గే వీలుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సందర్బాల్లో కేంద్రం దృష్టికి తీసుకువచ్చింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించే క్రమంలో బిపిఎల్ కుటుంబాలు తగ్గుతున్నాయనే వాదనను తీసుకువస్తున్నారు. పైగా ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు పది శాతం కంటే ఎక్కువ ఉంది. రాష్ట్రంలోని ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పాటు, విద్య, వైద్య రంగాలు బాగా వృద్ది చెందడం, ప్రజలందరికి ఉపాధి అవకాశాలు పెరుగుపడడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. అదే జరిగితే రాష్ట్రంలో బిపిఎల్ కుటుంబాల సంఖ్య తగ్గాలి. కానీ తెల్లరేషన్ కార్డుల జారీ వ్యవహారాన్ని పరిశీలిస్తే దీనికి భిన్నమైన వాతావరణం నెలకొంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించడానికి ప్రభుత్వం శాస్త్రీయంగా 13 అంశాలను పరిశీలిస్తుంది. విద్య, వైద్యం, తాగునీరు, ఆహారం, గృహవసతి వంటి అవరాలపై ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నారనే అంశాల ఆధారంగా బిపిఎల్ కుటుంబాలను నిర్దారిస్తారు. అంతే కాకుండా వారి ఆదాయం ఎంత, ఆర్థిక వనరులు ఏమిటీ అనే విషయాలను కూడా దృష్టిలో పెట్టుకుంటారు. పట్టణ ప్రాంతాల్లో నెలకు రెండు వేల రూపాయలు అంటే ఏడాదికి 24 వేల రూపాయల లోపు ఆదాయం ఉన్న కుటుంబాన్ని బిపిఎల్ కోటా కింద పరిగణిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేల వార్షిక ఆదాయాన్ని బిపిఎల్ కుటుంబంగా పరిగణిస్తారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజల శాతం గ్రామీణ ప్రాంతాలతో పొలిస్తే పట్టణ ప్రాంతాల్లో కొంత తక్కువగా ఉంది. ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్’ (ఎన్ఐఆర్డి) సమాచారం ఆధారంగా 2002వ ఏడాది లెక్కల ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 27.70 లక్షల కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నాయి. ఇందులో 4.79 లక్షల కుటుంబాలు ఎస్టీ వర్గానికి చెందగా, 8.25 లక్షల కుటుంబాలు ఎస్సీ వర్గానికి చెందినవి ఉన్నాయి. ఒబిసి ఇతర కులాకు చెందిన కుటుంబాలు 14 లక్షలకు పైగా ఉన్నాయి. ఈ వర్గాల ఆదాయాన్ని పరిశీలిస్తే నెలకు 250 రూపాయలు సంపాదించే కుటుంబాల సంఖ్య సుమారు 8.44 లక్షలు ఉంది. అలాగే 250 నుంచి 499 రూపాయల నెలసరి ఆదాయం కల్గిన కుటుంబాల సంఖ్య 9.48 లక్షల వరకు ఉంది. ఈ కుటుంబాలను అత్యంత పేదరికంలో ఉన్నట్టు గుర్తించారు. 500 నుంచి 1499 రూపాయల ఆదాయం కల్గిన కుటుంబాలు 6.55 లక్షలు కాగా, 1500 నుంచి 2500 రూపాయలను సంపాదించే కుటుంబాల సంఖ్య 10 లక్షల వరకు ఉన్నట్టు సర్వేలో వెల్లడయింది. బిపిఎల్ కింద ఉండి నెలకు 2500 రూపాయలపైబడి సంపాదించే కుటుంబాల సంఖ్య 20 వేలు మాత్రమే ఉన్నాయి. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వ సర్వే ప్రకారం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజల సంఖ్య 1.60 కోట్ల మంది ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తెల్లరేషన్ కార్డుల ప్రకారం కుటుంబాల సంఖ్యనే ఇంతకంటే అధికంగా ఉంది. అంటే ఏడు కోట్ల ప్రజలు ఉన్నారు. మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, అనేక రంగాల్లో పెరుగుతున్న అవకాశాల వల్ల దారిద్య్రరేఖ దిగువన ఉన్న కుటుంబాలు ఎగువకు వస్తున్నాయని అంచనా వేస్తున్నారు. పలు సందర్బాల్లో కేంద్రానికి ఇచ్చిన నివేదికల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావించింది. అయితే ఇక్కడ మాత్రం తెల్లరంగు రేషన్ కార్డుల సంఖ్య భారీగా జారీ చేస్తున్నారు. టిడిపి ప్రభుత్వ హాయాంలో 1.30 కోట్లు ఉన్న ఈ కార్డుల సంఖ్య నేటికి 1.84 కోట్లకు చేరుకుంది. రాష్ట్రంలో అమలు పరుస్తున్న రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇండ్లు వంటి పధకాలకు తెల్లరంగు రేషన్కార్డు తప్పని సరిగా ఉండాలి. దాంతో దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న కుటుంబాలు కూడా తెల్లరంగు రేషన్కార్డులు తీసుకున్నట్టు అంచనా. అలాగే ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ కార్డులు కూడా ఉన్నాయి. స్వంత గ్రామంలో ఒక కార్డు, పనిచేసే ప్రాంతంలో మరో కార్డును తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. బోగస్ కార్డులు భారీగానే ఉన్నట్టు ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ ఏరివేసే ప్రక్రియను చేపట్టడం లేదు. రాబోయే ఎన్నికలతో పాటు ఇతర కారణాల రిత్యా బోగస్ కార్డులను ముట్టుకోవడం లేదు. ఐరిస్ టెక్నాలజీ ద్వారా జారీ చేసిన ఈ కార్డులను మండలం, జిల్లా, రాష్ట్రం స్థాయి సమాచారాన్ని క్రోడీకరిస్తే ఈ బోగస్ కార్డులను సులువుగా గుర్తించడానికి వీలవుతుంది. ఇందు కోసం ప్రత్యేక సాప్ట్వేర్ను ఉపయోగించాల్సి ఉంది. దీనికి సుమారు 20 కోట్ల రూపాయల వ్యయం చేయాల్సి ఉంది.
as per Central Govt survey in 2002, there are 27,70,527 BPL families in AP
——————————————————————————————————————
district BPL families white ration card
—————————————————————————————————————–
srikakulam 2,22,559 6,21,069
vizainagaram 90,148 5,87,503
visakhapatnam 83,985 8,74,752
E.Godavari 1,14,578 11,33,425
W.Godavari 2,16,131 9,10,912
Krishna 1,50,571 9,27,466
Guntur 1,21,556 10,15,404
Prakasham 1,70,355 7,41,126
Nellore 1,23,489 6,99,608
Chittoor 1,82,815 8,44,505
kadapa 35,483 5,93,637
Anantapur 1,20,072 9,99,745
Kurnool 76,545 7,84,802
Mahabubnagar 2,33,029 8,58,213
Rangareddy 47,783 8,64,027
Medak 72,379 6,9,084
Nizamabad 23,094 4,99,156
Adilabad 1,44,989 5,48,070
Karimanar 1,10,601 7,98,403
Warangal 1,25,249 7,86,496
Khammam 1,80,478 5,67,563
Nalgonda 1,24,638 7,26,545
——————————————————————————————————————
Total 27,70,527 1,70,77,511
——————————————————————————————————————
landless poor (BPL families)
——————————————————————————————————————
category no.of households
——————————————————————————————————————
SC 2,77,505
ST 4,90,134
OBC 6,75,036
others 2,79,728
——————————————————————————————————————–
Total 17,22,403
——————————————————————————————————————–
source : vaartha, 18 april 2008
No Comments Yet
No comments yet.
Comments RSS TrackBack Identifier URI
Leave a comment



